Thursday 19 March 2015

HUMANITY .....





ఉదయం 11 గంటలయ్యింది, రోడ్డు అంతా
రద్దీగా ఉంది. నిదానంగా అడుగులో
అడుగేస్తూ,
ఒక డెబ్భై యేళ్ళ పండు ముసలమ్మ, చేతిలో
ఒక
కర్ర సాయంతో నడవలేక నడుస్తూ, మధ్య
మధ్య
కాస్త సేదదీరుతూ, వస్తోంది మెల్లిగా.
దారిలో ఒకతను స్కూటరుపై
వస్తుండటం గమనించి, అతణ్ణి ఆపి, "ఇదిగో
అయ్యా.. ముడు కాళ్ళ ముసలిదాన్ని,
నడవలేకపోతున్నా,కాస్త నన్ను మా ఇంటి
దాకా
దింపుతావా, యాతన గా ఉంది,
నీకు పుణ్యం ఉంటుంది... " అని అడిగింది.
దానికతను, "యేవమ్మో.. పొద్దున్నే నేనే
దొరికానా నీకు, నిన్ను దింపుకుంటూ
ఉంటే, నా
పనులెవరు చేస్తారు?, ఇంకెవరినైనా అడుగు
పో
పొవమ్మా.. " అని వెళ్ళిపోయాడు.
ఆ ముసలమ్మ పాపం నడవలేక ఇబ్బంది
పడుతూ ఉన్నా, ఎవరు ఆమెకు సాయం
చేయటానికి
రాలేదు. చాలా మందిని అడిగింది. ఇంత
బిజీగా ఉన్న సిటీలో ఎవరి పని వారిదే.
ఆమె అసహాయతని అర్థం చేసుకున్న వాళ్ళు
లేరు.
కానీ, ఇదంతా దూరం నుండి
గమనిస్తూ ఉన్నాడు ఓ 25 ఏళ్ల అబ్బాయి.
ఉద్యోగానికి వెళ్తూ బస్ స్టాపులో
ఎదురు చూస్తున్నాడు బస్సు కోసం. ఆ
ముసలమ్మకి
అసలు సమస్యేమిటో కదా?, వెళ్లి ఓసారి
కనుక్కుందాం అని ఆమె దగ్గరికెళ్ళి,
"అమ్మా..! ఎవరు మీరు ? మీకేం కావాలి?" అని
అడిగాడు. ఆ ముసలమ్మ, "నేను నడవలేను,
ఇంటిదాకా
నాకు సాయం రమ్మంటే ఎవరూ రావటం
లేదయ్యా..."
అని చెప్పింది. "అయ్యో! అవునా..
ఎక్కడికెళ్ళాలి,పదండి నేను తీసుకెళ్తాను..
" అన్నాడు అబ్బాయి. "వద్దులే బాబు,
నువ్వు కూడా
ఏదో తొందరలో ఉండి ఉంటావ్, నేనే ఎలాగోలా
పోతాలే... " అంది ఆ ముసలమ్మ.
"ఏం ఫరవాలేదమ్మా! మహా అయితే
నాకు కొంచం ఆలస్యం అవుతుంది అంతే.. పద
నేను తీసుకెళ్తాను" అని ఆమెకి తోడుగా
సాయం అందించి తీసుకెళ్ళాడు ఆమె
ఇంటికి.
అది ఒక పూరి గుడిసె.. అందులో
నలుగురు వికలాంగులైన పిల్లలు ఉన్నారు.
వాళ్ళని
చూసి ఆమెని అడిగాడు,"అమ్మా !
ఎవరు వీళ్ళంతా... ?" అని. అప్పుడా
ముసలమ్మ,
"వీళ్ళంతా తల్లి దండ్రులు వదిలేసిన
పిల్లలు.. నాతో పాటే వీళ్ళకీ ఇంత
కూడు పెడదామనే నేను పుల్లలమ్మి
వస్తున్నా..
దారిలో అలసిపోయి
సాయం కోసం అడిగానయ్యా... " అని
చెప్పింది. అప్పుడు అబ్బాయి "నీకు ఏమి
కాని వాళ్ళ కోసం నువ్వు ఇంత
కష్టపడుతున్నావా?
నీకే కష్టం కదమ్మా" అన్నాడు.
అప్పుడా ముసలమ్మ, "లేదయ్యా!,
పాపం పసివాళ్ళు వీళ్ళు, రోడ్డున పడి ఉన్న
వీళ్ళని చూసి వదల బుద్ధి కాలేదు, నా
కొడుకూ ఉండే వాడు, ఇలా వికలాంగుడై
చనిపోయాడు. వీళ్ళలో నా కొడుకుని
చూసుకుంటూ బతుకుతున్నా, అయినా ఏమి
కాని
దాని కోసం నువ్వూ సాయానికి వచ్చావుగా...
సాయం చేసినోల్లకు దేవుడు మంచే
చేస్తాడు.. నువ్వు నా
కొడుకు లాంటి వాడివే, ఇదిగో ఓ ముద్ద
తిను.. "
అని అన్నం కలిపి పెడుతుంటే, అబ్బాయి
కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
అప్పటినుండి ఆ ఇంటికి రోజూ వెళ్ళేవాడు ,

సాయం లో తానూ ఓ భాగం అయ్యాడు.
"కుటుంబంలో ఒక్కరు ఆకలితో ఉన్నా
తట్టుకోలేని
మనుషులున్న సమాజంలో, రోడ్డున పడి ఉన్న
అనాదలకు ఒక పిడికెడు అన్నమైనా వేయలేని
నిర్లక్ష్యం కూడా ఉంది.. నిస్సహాయులైన
వారికి అందించే సాయం, సూటిగా భగవంతుని
చేరుతుంది అంటారు.. అటువంటి ఆదుకునే
మనసున్న
ప్రతి మనిషికి వందనం

No comments:

Post a Comment