Saturday 26 December 2020

నాన్నా తో ప్రయాణం

 ఒక ఇంట్లో 80 సంవత్సరాలు వయసున్న తండ్రి, 45 సంవత్సరాల వయసున్న కొడుకు ఉన్నారు. ఒక రోజు ఇద్దరూ సోఫాలో కూర్చొని ఉండగా ఒక కాకి వచ్చి వాళ్ళ ఇంటి కిటికీ మీద వాలింది.


అది ఏమిటి? అని తండ్రి, కొడుకుని అడిగాడు.


కాకి అని చెప్పేడు కొడుకు.


మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి


ఇప్పుడే కదా కాకి అని చెప్పేను అన్నాడు కొడుకు.


మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి.


కొడుకు మొహం చిట్లించుకుని అసహనంతో ” అది కాకి, కాకి ” అని గట్టిగా చెప్పేడు.

మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి.

కొడుకు గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు” ఎందుకు నాన్నా ఒకటే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతావు. అది కాకి అని 4సార్లు చెప్పేను, అర్థంకావట్లేదా”


కొంచంసేపటి తరవాత తండ్రి గదిలోకి వెళ్ళి ఒక డైరీ తెచ్చాడు. కొడుకు చిన్నప్పటి విషయాలు అన్నీ అందులో ఉన్నాయి. ఒక పేజి తీసి చదవమని కొడుకు చేతికి ఇచ్చ్హాడు.అందులో ఈ విధంగా రాసి ఉంది.


“ఇవాళ నా మూడేళ్ళ కొడుకు నాతోపాటు సోఫాలో కూర్చున్నాడు. ఒక కాకి వచ్చి కిటికీ మీద వాలింది. అది ఏమిటి నాన్నా? అని వాడు 23సార్లు అడిగాడు.ప్రతిసారీ నేను ప్రేమతో వాడిని దగ్గరికి తీసుకుని కాకి అని చెప్పేను. వాడు అన్నిసార్లు అడిగినా నాకు కోపం రాలేదు, పైగా వాడి అమాయకత్వానికి నవ్వు వచ్చింది.”


కొడుకు చిన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా తండ్రి ఓపికగా అర్థమయ్యేలా చెప్పేడు. ఇవాళ అదే తండ్రి ముసలివాడు అవ్వడంవల్ల 4సార్లు అడిగితే కొడుకు విసుక్కుంటున్నాడు

.

తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్దచేస్తారు. వాళు ముసలివాళ్ళు అయ్యాక విసుక్కోవడం, చులకనగా చూడడం చెయ్యకూడదు. వాళ్ళు పంచిన ప్రేమని, వాళ్ళు పడిన కష్టాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండడం పిల్లల బాధ్యత.🍁

No comments:

Post a Comment