Wednesday 27 April 2016

ఎంత మార్పు ?



పదిహేనేళ్ల క్రితం… నవంబరు నెల…
మా ఊళ్లో బస్సు దిగాను. నాలుగు రోడ్లు కలిసే ఆ కూడలిలో ఓ పక్క చిన్న బడ్డీకొట్టు, మరోపక్క టీ దుకాణం. అప్పుడే తెల్లవారుతోంది. బడ్డీకొట్టు దగ్గర నిలబడి ఉన్న కూసం మధు ”ఇదేనా రావడం?” అని ప్రశ్నించాడు నవ్వుతూ.
అవునన్నట్లు తలూపాను.
”అంతా కుశలమేనా! ఉద్యోగం ఎలా ఉంది?” మళ్లీ అడిగాడు. ఆయన అదునెరిగి వ్యవసాయం చేస్తాడు. కష్టజీవి.
”బాగుంది. అంతా హ్యాపీ బాబాయ్‌” బదులిస్తూ ముందుకు సాగాను.
మావయ్య గారింట్లో అడుగు పెట్టగానే, రాగిచెంబు నిండా మంచినీళ్లు తెచ్చిచ్చింది అత్తయ్య.
”మావయ్యేడీ?” మంచినీళ్లు తాగి, చెంబు తిరిగిస్తూ అడిగాను.
”మేత కోసుకు రాబొయ్యాడు” చెప్పింది అత్తయ్య.
నేను గడ్డం చేసుకుని, స్నానం చేసేసరికి అత్తయ్య టిఫిన్‌ రెడీ చేసింది. వేడివేడి గుంటపునుగులు నెయ్యి వేసిన కారప్పొడిలో నంజుకు తింటుంటే నాలుక మీది గ్రంథులు నాట్యం చేశాయి. స్కూల్లో చదువుకునే రోజుల్లో పొగపొయ్యి కింద పత్తిమోళ్లు ఎగదోస్తూ, నల్లటి పెనం మీద అమ్మ అట్లు పోసిపెట్టేది. అయిదారు తిన్నా కడుపు నిండినట్లు అనిపించేది కాదు.
హైదరాబాదులో ఉద్యోగంలో చేరాక, నేనీ ఊరికి రావడం ఇది రెండోసారి.
బయటికి బయల్దేరబోతుంటే, సైకిలు మీద జొన్నమోపుతో వచ్చాడు మావయ్య. అంత పెద్ద మోపును ఎలా బ్యాలెన్స్‌ చేస్తాడో నాకెప్పటికీ ప్రహేళికే. డెబ్భై అయిదు కిలోల వడ్లబస్తాను కూడా అలాగే సైకిలు క్యారేజీ మీద మిల్లుకు తీసుకెళ్లేవాడు. పైగా దారిలో ఎవరైనా ఎదురైతే, బ్రేకులు వేసి, ఓ కాలు నేలపై ఆనించి, తాపీగా కబుర్లు చెప్పి మరీ కదిలేవాడు.
ఆయనతో కాసేపు మాట్లాడి, ఎనిమిది కావస్తుండగా బజాట్లోకి వచ్చాను. ఊరికి పడమటి పక్కనున్న చెరువు నుంచి కొందరు కావిళ్లతో, మరికొందరు సైకిళ్ల మీద మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు. జీవనది మాకు పది కిలోమీటర్లలోపే ఉన్నా దశాబ్దాల తరబడి మా ఊరు మంచినీటి సదుపాయానికి నోచుకోలేదు. చిన్నప్పుడు నేను ఓ బిందె నెత్తిన పెట్టికొని తెచ్చేవాణ్ని.
పెదనాన్న గారింటికి వెళ్లాను. నేను నాలుగో తరగతి చదివేటప్పుడు ఓ ప్రమాదంలో నాన్న మరణించినప్పటి నుంచీ ఆయనే మా మార్గదర్శి. నవారు మంచంమీద కూచుని ఆయనతో పిచ్చాపాటి మాట్లాడుతుండగా, పెద్దమ్మ పాలు తెచ్చిచ్చింది.
”బాబూ బాగున్నావా?” వెంకాయమ్మ, నాగరత్నం ఒకే గొంతుతో అడిగారు. వాళ్లిద్దరూ అప్పచెల్లెళ్లు. పెదనాన్న గారింటి పక్క ఇల్లు. వెంకాయమ్మ కలవారింటి కోడలయింది. తెనాలిలో కాపురం. భర్త ఇల్లరికం రావడంతో నాగరత్నానికి పుట్టిల్లే మెట్టినిల్లయింది. కట్నం కింద వెంకాయమ్మకు ఇచ్చిన రెండెకరాలు కూడా భర్తతో కలిసి నాగరత్నమే సాగు చేస్తుంది. చెల్లెలి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏనాడూ కౌలు కూడా తీసుకునేది కాదు వెంకాయమ్మ. ఆమె భర్త కూడా ”ఆ పొలం మహా అయితే లక్షో రెండు లక్షలో చేస్తుంది. మీ చెల్లినే ఉంచుకోమను” అనేవాడు.
”మీరెప్పుడొచ్చారత్తా?” వెంకాయమ్మను అడిగాను, ఊళ్లో చాలామందిని ఏదో ఒక వరసతో పిలవడం చిన్నప్పట్నుంచీ అలవాటు.
”నిన్ననే వచ్చా. ఇప్పుడు బయల్దేరుతున్నా. బాబాయికి చెప్పి వెళ్దామని వచ్చా” చెప్పిందామె.
పెదనాన్నతో కాసేపు మాట్లాడి, వేణు ఇంటికి బయల్దేరాను. నాకంటే రెండేళ్లు పెద్దవాడైనా, మున్నంగి వేణుతో మంచి స్నేహం ఉండేది. ఇద్దరం కలిసి సినిమాలకు వెళ్లేవాళ్లం. స్కూలుకు సెలవులు వస్తే, తనతోపాటు పొలం పనులకు తీసుకెళ్లేవాడు. కలుపు తియ్యటం, పత్తి తియ్యటం, జొన్న కొయ్యటం, పత్తిమోళ్లు పీకటం వంటి పనులన్నీ తనే నేర్పించాడు.
నేను వెళ్లేసరికి, వేణు అన్నం తింటున్నాడు. వాళ్ల తమ్ముడు హర్ష, నన్ను చూడగానే ఎదురొచ్చి కరచాలనం చేశాడు. అతను నా కన్నా చిన్నవాడు. మా ఊరినుంచి ఐఐటీ చదివిన మొదటి వ్యక్తి.
”ఎప్పుడొచ్చావు హర్షా?” నవ్వుతూ పలకరించాను.
”మూడు రోజులవుతుంది. సాయంత్రం బయల్దేరుతున్నాను” అతను ముంబైలో ఇంజినీరుగా పని చేస్తున్నాడు.
వాళ్ల నాన్న పాతికెకరాల రైతు. ఒక్కడే చూసుకోవడం కష్టమైపోవటంతో వేణును పదో తరగతితో చదువు మాన్పించేసి, తనకు చేదోడుగా పొలం తీసుకెళ్లాడు. హర్షను మాత్రం బాగా చదివించాడు. తమ్ముడి కోసం వేణు చాలానే త్యాగం చేయాల్సి వచ్చినా తను ఏనాడూ అలా భావించేవాడు కాదు. హర్ష కూడా అన్న పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడు.
కాసేపటి తర్వాత ”చేనికెళ్లి పత్తిగోతాలు తీసుకురావాలి ట్రాక్టరు మీద. రాగలవా?” ఇప్పుడు నేను ఫ్యాను కింద       ఉద్యోగంలో ఉన్నందున ఎండంటే భయపడతానేమోనని వేణు అనుమానం.
”ఇంకా సుఖానికి అలవాటు పడలేదులే బావా. పద, వెళ్దాం” అంటూ లేచాను.
బొమ్మలు దాటాక, తూర్పువైపున ఉన్న ఓ కట్ట ఎక్కి దిగుతుంటే నాకు భయం వేసింది. వేణు మాత్రం తనకు బాగా అలవాటైనట్లు అలవోకగా నడిపాడు ట్రాక్టర్ని. సరాసరి చేలోకి తీసుకెళ్లి ఆపాడు. నేను ట్రాక్టరు మీంచి కిందికి దూకాను.

చాలాకాలం తర్వాత విశాలమైన నేలతల్లి ఒడిలో అడుగు పెట్టిన ఆనందం నాలో పొంగులు వారుతోంది. విత్తనాలు వెదబెడుతూ, కలుపులు తీస్తూ, కళ్లాలు చేస్తూ… ఏవేవో జ్ఞాపకాలు పక్షుల్లా ఎగిరొచ్చి, గుండెల మీద వాలుతున్నాయి.
నాలుగెకరాల చేలో పత్తిగుబ్బలు బాగా పగిలి, చేనంతా తెల్లటి వస్త్రం పరిచినట్లు కనిపిస్తోంది. పదిహేను మంది కూలీలు వంచెలు కట్టుకుని పత్తి తీస్తున్నారు. గట్టుకు రాగానే వంచెల్లోని పత్తిని గోతాల్లో నింపుతున్నారు.
ట్రక్కును పత్తిచేను పక్కనే ఉన్న జొన్నచేలో ఆపి, కొడవలితో జొన్న కొయ్యటం మొదలుపెట్టాడు వేణు. నేను సరదాగా ఓ మునుం పట్టి, పత్తి తియ్యటంలోని అనుభవాన్ని నెమరు వేసుకుంటున్నాను. కూలీలు చిత్రంగా చూస్తున్నారు.
ఆ చేనుకు ఉత్తరంగా ఉండేది మా రెండెకరాల పొలం. అక్క పెళ్లికోసం ఎకరం పద్దెనిమిది వేలకు అమ్మేశాం.
గంట తర్వాత వేణు, ట్రాక్టర్ని తీసుకొచ్చి, పత్తిగోతాల దగ్గర ఆపాడు. ఇద్దరు కూలీలు వెళ్లి పత్తిగోతాల్ని ట్రక్కులోకి ఎక్కిస్తుంటే, వేణు వాటిని జొన్నగడ్డి మీద సర్దుతున్నాడు. నేను గట్టుమీద నిలబడి పచ్చటి ప్రపంచాన్ని చూస్తున్నాను.
వేణు ఇంజిన్‌ స్టార్ట్‌ చేయగానే, నేనూ ట్రాక్టరెక్కి, అతని పక్కనే కూచున్నాను. నల్లటి మట్టిని నమిలి ఊస్తున్నట్లుగా టైర్లు భారంగా ముందుకు తిరుగుతున్నాయి. ట్ట్రారు కట్ట దగ్గరకు చేరుకోగానే, గేరు మార్చి, ఎక్స్‌లేటర్‌ను తొక్కి పట్టాడు.  ముందు టైర్లు రెండూ గభాల్నపైకిలేచి, మళ్లీ నేలమీద వాలాయి. కట్టను ఎక్కుతుండగా, ట్రక్కు కొద్దిగా ఊగి, అమాంతం బోల్తా పడింది. వేణు, నేను కిందికి దూకాం. ట్రక్కులోని పత్తిగోతాలు, జొన్నగడ్డి చెల్లాచెదురుగా చేలోకి పడిపోయాయి.

దూరం నుంచి చూస్తున్న కూలీలు పరుగున చేరుకున్నారు. ట్రాక్టరు నుంచి ట్రక్కును విడదీశారు.
పత్తిగోతాలు, జొన్నగడ్డి మళ్లీ ట్రక్కులోకి ఎత్తేసరికి ఒంటిగంట అయింది.
కూలీలు పట్టుబట్టడంతో వేణు, నేను జమ్మిచెట్టు కిందికి చేరుకున్నాం. అందరూ వచ్చి సద్దిమూటలు విప్పారు. ఒకామె సత్తు టిపినీలోనే అన్నంలో పప్పు, బీరకాయ పచ్చడి కలిపి, తలా ఒక ముద్ద పెట్టింది. నా దోసిట్లో ఉన్న పచ్చడిముద్ద నుంచి కమ్మటి వాసన విడుదలైంది. నోట్లో పెట్టుకుంటే, వెన్నలా కరిగిపోయింది. ఆమె అలా పెడుతూనే ఉంది. పెరుగన్నం తినటం పూర్తయ్యాక, చేతులు కడుక్కున్నాం. చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిన్న భావన.
ఈసారి వేణు చాలా జాగ్రత్తగా కట్టను దాటించి, రోడ్డు మీదికి ఎక్కించాడు.
మూడు దాటుతుండగా ఇంటికి చేరుకున్నాం. వేణుకు చెప్పి, అక్కడి నుంచి కదిలాను.
నడిచి వెళ్తుంటే ఆ రోడ్డు పొడవునా ఎన్నో జ్ఞాపకాలు. కర్ర-బిళ్ల, నేల-బండ, వంగుడుదూకుళ్లు, చిత్తుపేకలు, బచ్చాలాట, గోళీకాయలు, చెడుగుడు, కోతికొమ్మచ్చి… ఎండను సైతం లెక్క చెయ్యకుండా ఎన్ని రకాల ఆటలు ఆడేవాళ్లమో!
మావయ్య గారింటికి చేరుకున్నాక మొలకు కండువా కట్టుకుని పెరట్లోకి వెళ్లాను. బావిలోంచి కడవతో నీళ్లు తోడుకుని, నెత్తిమీద పోసుకుంటే, హాయిగా అనిపించింది. తల తుడుచుకుంటూ, వెనకవైపు చూస్తే, ఓ మిద్దె కనిపిస్తోంది. తొలి ఏకాదశి పండక్కి పిల్లలందరం నోటినిండా పేలపిండి పోసుకుని, ఆ మిద్దె మీదికెక్కి గాలికి అభిముఖంగా నిలబడి ”పు..సు..లూ..రు..” అని అరిచేవాళ్లం. నోట్లోని పిండి అంతా జల్లులా బయటకు పడిపోతుంటే, పొట్ట చెక్కలయ్యేలా నవ్వేవాళ్లం.
అయిదున్నరకు వేణు వచ్చాడు. ఇద్దరం మేం చదువుకున్న సెయింట్‌ మేరీస్‌ హైస్కూలుకు వెళ్లాం. పేదపిల్లల విద్యాభివృద్ధి కోసం ఒక ట్రస్టు ప్రారంభించాలనుకుంటున్న విషయమై ఫాదర్‌తో చర్చించాం. ఆయన పొంగిపోయాడు. మా పేర్లతో ప్రార్థన చేసి, ఆశీర్వదించాడు.
రాత్రి ఏడుగంటలకు వినాయకుడి గుడికి చేరుకున్నాం. అక్కడ గుడితోపాటు కళామందిరం ఉంటుంది. ఆ వేదిక మీదే నేను ఎన్నో నాటికలూ నాటకాలూ చూశాను. గుడి ఎదుట గల ఖాళీస్థలంలో యాభై మందికి పైగా యువకులు వృత్తాకారంలో నిలబడి, చెక్కభజన చేస్తున్నారు. రామాలయంలో ఏటా సప్తాహం చేసేవారు. రాత్రిపూట హరికథలు, బుర్రకథలు చెప్పేవాళ్లు. ఆ కళారూపాల ద్వారా బాల్యంలో విన్న విషయాలు ఇప్పటికీ నా గుండెల్లో చెక్కు చెదరలేదు.
”అరే, వెంకట్‌, ఎప్పుడు రావటం?” ఎక్కడినుంచి చూశాడో, పరిగెత్తుకుంటూ వచ్చి, కౌగిలించుకున్నాడు అయూబ్‌ఖాన్‌. వాడు, నేను పదో తరగతి వరకూ కలిసి చదువుకున్నాం.
పిచ్చాపాటి అయ్యాక ”చలో, మా ఇంటికి డిన్నర్‌కు వెళ్దాం” ఆహ్వానించాడు అయూబ్‌. నేను మరోసారి వస్తానన్నా వాడు వినలేదు. ఆరోజు తన కొడుకు జన్మదినం కావడంతో రావాల్సిందేనని పట్టుబట్టాడు.
వేణుతో కలిసి వెళ్లాను. మటన్‌ బిర్యానీ అంటే నాకున్న అయిష్టం ఆరోజుతో తుడిచిపెట్టుకు పోయింది. సేమ్యాతో చేసిన స్వీటు కూడా అద్భుతం.
భోజనం పూర్తిచేసి, అయూబ్‌ఖాన్‌ కొడుకుని ముద్దాడి, వాడి చేతుల్లో వంద రూపాయలుంచి, వీడ్కోలు తీసుకున్నాను.
ఆ రాత్రి కంటినిండా నిద్రపోయాను. ఉదయం ఏడింటికిగానీ మెలకువ రాలేదు. రాత్రంతా జోరుగా కురిసిన వర్షం ఇంకా సన్నటి జల్లు రూపంలో ఉనికిని చాటుకుంటూనే ఉంది.
ఎనిమిది కావస్తుండగా వేణు వచ్చాడు, గొడుగు వేసుకుని. ఇడ్లీ తిని, కబుర్లు చెప్పుకొంటుండగా… ఓ కుర్రాడు యూరియా గోతాన్ని గొంగళిలా కప్పుకొని, పరిగెత్తుతూ వచ్చాడు.
”వేణు పెదనాన్నా… నాన్న యెండ్రిన్‌ తాగాడు. రాజు డాక్టరు దగ్గరికి తీసుకొచ్చాం. అమ్మ నిన్నర్జెంటుగా రమ్మంటంది” గస పెడుతూ చెప్పేసి, వేణు సమాధానం కోసం చూడకుండా వెళ్లిపోయాడా కుర్రాడు.
”ఎవరు?” అడిగాను.
”ఛత్‌… వాడే… అక్కల కిట్టయ్యగాడు…” విసుగ్గా చెప్పాడు వేణు. కిట్టయ్య ఆరో తరగతి వరకూ నా క్లాస్‌మేట్‌. చదువు మానేసి, తల్లికి అండగా వ్యవసాయంలోకి దిగాడు.
వేణుతోపాటు నేనూ బయల్దేరాను. ఇద్దరం గొడుగు సాయంతో ఆరెంపీ డాక్టరు గారింటికి చేరుకున్నాం.
కిట్టయ్యను బల్ల మీద పడుకోబెట్టి, కడుపులోకి గొట్టం వేసి, కక్కిస్తున్నారు. ఓ చేతికి సెలైన్‌ ఎక్కిస్తున్నారు.

ఇద్దరం ఓ పక్కగా నిలబడ్డాం. చూస్తుండగానే జనం పోగయ్యారు. తలా ఒక రకంగా చర్చించుకుంటున్నారు. కిట్టయ్య భార్య గుండెలవిసేలా ఏడుస్తోంది.
”అసలేం జరిగింది?” వేణుకు కారణం తెలిసే ఉంటుందని అడిగా.
”ఏముంది, వరసగా మూడోయేడు పచ్చపురుగు పత్తిని కాటేసింది… అది ఈణ్ని కాటేసింది…”
ఎనభైల తర్వాత మా ఊళ్లోకి పత్తి ప్రవేశించింది. శివాలెత్తినట్లు రైతులందరూ తెల్లబంగారం కోసం అర్రులు చాచారు. మొదట్లో బాగానే పండింది. ప్రతి ఇంట్లో ఒక పత్తిమండె వెలిసింది. రైతులు నాలుగు డబ్బులు కళ్లజూశారు. రాన్రాను రకరకాల తెగుళ్లు, పచ్చపురుగుల బెడద అధికమైంది. పెట్టుబడులు పెరిగిపోయాయి. క్రిమిసంహారక మందుల వాడకం యథేచ్ఛగా పెరిగింది. వానలు వెనకంజ వేశాయి. నష్టాలు మొదలయ్యాయి. ఆ దశకంలోనే మొదటిసారిగా మా ఊళ్లో పత్తిరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్నుంచీ ఆ చావులు సర్వసాధారణమయ్యాయి, రకరకాల కారణాలతో.
అరగంట తర్వాత ఆరెంపీ డాక్టరు పెదవి విరిచాడు. అర్జెంటుగా గుంటూరు తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు.
అప్పటికప్పుడు కిట్టయ్యను నులకమంచం మీద పడుకోబెట్టుకుని, నలుగురు మోసుకుంటూ బస్‌స్టాండుకు తీసుకెళ్లారు. పది నిమిషాల తర్వాత బస్సు వచ్చింది. కండక్టరును బతిమాలి, కిట్టయ్యను మెల్లగా బస్సులోకి చేర్చి, ఓ సీటులో పడుకోబెట్టారు. వేణు, కిట్టయ్య భార్య, మరో ఇద్దరు వెంట వెళ్లారు.
నేను భారమైన మనసుతో అక్కణ్నుంచి కదిలాను.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++



ఇప్పుడు 2016 రాజధాని గా తుళ్ళూరు 
పది రోజుల క్రితం… ఆగస్టు నెల… మధ్యాహ్నం మూడు దాటుతోంది…
ఖరీదైన నా కారులో మా ఊరికి చేరుకున్నాను. సెంటర్‌ చాలా హడావుడిగా ఉంది. మంగళగిరి వెళ్లే రోడ్డులో రెండు హోటళ్లు, అమరావతి వెళ్లే వైపు ఫ్యాన్సీ షాపులు, తుళ్లూరు వెళ్లే దారిపక్క రెండు వైన్‌ షాపులు, తాడికొండ వైపు ఐరన్‌, సిమెంటు రిటైల్‌, హోల్‌సేల్‌ షాపులు… సంవత్సరం క్రితం వచ్చినప్పుడు ఈ హడావుడేమీ లేదు.
పది మీటర్లు కూడా పోకముందే, కూసం మధు కారాపాడు.
”ఇప్పుడేనా రాటం… నువ్వు ముందు కారు దిగు, ఇయ్యాల నాతో కలిసి కాఫీ తాగాల్సిందే” బలవంతం చేశాడు.
కారు దిగక తప్పింది కాదు. హోటల్‌ బయటే నుంచున్నాం. ఆయన కాఫీ ఆర్డరిచ్చాడు. మా చుట్టుపక్కల పదీ పదిహేను మంది టీలూ కాఫీలూ తాగుతూ కబుర్లు తింటున్నారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ సెల్‌ ఫోన్లున్నాయి.
”రేయ్‌, నిన్న తొట్టికాడ రామయ్య పొలాన్ని ఒకటీ ఇరవైకి అడిగారంట. ఈయనేమో ఒకటిన్నరకు తగ్గనన్నాడంట…”
”యాడుందిరా అంత రేటు? సుబ్బరంగా ఇచ్చెయ్యాల్సింది…”
”ఇయ్యాల నాకో పార్టీ వస్తంది వైజాగ్‌ నించి, దాసిరెడ్డి గారి నాలుగెకరాల బిట్టు చూట్టానికి! ఒకటీ అరవై చెబుతున్నాం. ఇదిగానీ ఓకే అయితే నా పంట పండినట్టే…”
”ఆశకి అంతుండాల్రా. ప్రత్యేక హోదా గురించి అతీగతీ లేదు. ఖజానా ఖాళీ అయి రాష్ట్ర ప్రభుత్వం లబోదిబోమంటంది. అసలు డెవలప్‌మెంటు మీద జనాలకి అనుమానాలు మొదలయ్యాయి…”
”అదేం లేదు. రేపు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చెయ్యనీ, రేట్లు మళ్లీ రయ్యిన లెగుస్తాయి…”
”అవున్రా, బుర్రముక్కు రాజారావుగాడు అడ్వాన్సు తీసుకుని కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ చెయ్యనంటున్నాడంటగా… పాపం ఆ పార్టీ నిన్న మా అన్న దగ్గరికొచ్చి, ఒకటే మయాన మొత్తుకుంటంది…”
నేను కాఫీ తాగినంతసేపూ మరో అంశం చర్చకు రాలేదు. మధ్యమధ్య సెల్‌ఫోన్లు మోగుతున్నాయి. ఫోన్లో కూడా బేరసారాల సంభాషణలే.
రోడ్డుకవతల ఫ్యాన్సీ షాపు పక్కనే ”శివప్రియ రియల్‌ ఎస్టేట్స్‌” అనే బోర్డును గమనించాను.
”ఏమిటి బాబాయ్‌, మనూళ్లో రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసా?” ఆశ్చర్యంగా అడిగాను.
”అయ్యో, ఇదేం జూశావ్‌! ఇలాంటివి ఊళ్లో ఇరవై దాకా వెలిశాయి” నా ఆశ్చర్యానికి అడ్డుకట్ట వేశాడు.
కాఫీ తాగాక, కారెక్కి మావయ్య గారింటికి చేరుకున్నాను.
”ఇప్పుడేనా రాటం” ఫ్రిజ్‌లోంచి తీసిన వాటర్‌బాటిల్‌ చేతికందిస్తూ అడిగింది అత్తయ్య.
”అవునత్తయ్యా, మావయ్యేడీ?”
”నిన్న మాటెపూట జొన్నలగడ్డ పొయ్యాడు. రేట్లొచ్చినయ్యిగా, నాకిచ్చిన పొలం అమ్మాలని సూత్తన్నాం”.
మొహం కడుక్కోవడానికి వాష్‌రూముకు వెళ్లాను. ట్యాప్‌ తిప్పితే, నీళ్లు పచ్చగా వచ్చాయి. ఈ మధ్యే ఓ స్వచ్ఛందసంస్ధలో పనిజేసే ఫ్రెండొకడు ఈ నీళ్లను ల్యాబ్‌కు పంపి టెస్ట్‌ చేయించాడు. తాగడం సంగతి అటుంచి, కనీసం వాడుకోవడానిక్కూడా వీల్లేనంతగా బ్యాక్టీరియా పేరుకుపోయి ఉందట. ఈ విషయాన్ని నేను గ్రామ సర్పంచికి ఫోన్జేసి చెబితే, ఆయన ”ఏళ్ల తరబడి నేనియ్యే పోసుకుంటన్నా. నాకేం కాలేదే” అన్నాడు, పరిష్కారం గురించి పల్లెత్తు మాట అనకుండా.
అత్తయ్య పెట్టిన స్నాక్స్‌ తిని, వేణు సెల్‌కు ఫోన్జేశాను.
”కొంచెం ముఖ్యమైన పనిలో ఉన్నాను. ఓ గంట తర్వాత కలుస్తా”నన్నాడు.
కారు ఇంటిదగ్గరే వదిలేసి, కాలినడకన బయల్దేరాను. రోడ్డు మీద ఓ కుళాయి దగ్గర జనం ఎగబడి మంచినీళ్లు పట్టుకోవడం కనిపించింది. మా ఊరి మీదగా పైపులైను వేసుకుని మరీ తాడికొండకు నీళ్లు తీసుకెళ్లగలిగారు. అధికారులు దయదలచి, ఆ లైనుకు రెండుచోట్ల ట్యాపులు బిగించారు. ఊరు మొత్తానికీ ఆ కుళాయిలే ఆధారం.

పెదనాన్న గారింటికి వెళ్లేసరికి ఆయన వరండాలోనే ఎవరితోనో సీరియస్‌గా ఫోన్లో మాట్లాడుతున్నాడు.
నేను లోపలి గదిలోకి వెళ్లాను. పెద్దమ్మ వచ్చి, ఏసీ ఆన్‌ చేసి, ఓ గాజుగ్లాసులో కోకోకోలా తెచ్చిచ్చింది. తాగుతుండగా, పెదనాన్న లోపలికొచ్చి, సోఫాలో కూచున్నారు.
”మాట్టాడారా బాబాయ్‌…” ఆత్రంగా అడిగింది నాగరత్నం. ఆమె ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్లనిపించింది.
”ఆఆ… తన బాధ తనది…” పెదనాన్న చెప్పింది ఆమెకు అర్థమైనట్లుంది.
”ఏం బాద బాబాయ్‌? తనకేం తక్కువ జేశామని? ఆమె సొమ్మేదో మేం అప్పనంగా అనబగించినట్టు మాట్టాడతంది… ఉప్పు, పప్పు, బియ్యం, మిరపగాయలు… ఎన్ని పంపేవాళ్లం? సన్నాసి పొలం మనకెందుకు అని మా బావ గూడా ఇన్నిసార్లు అన్నాడు. ఆ మాటకొత్తే అయినింటి సమ్మందమని దానికి ఎకరా ఎక్కువిచ్చారు. ఉప్పుడు నేనూ అడుగుతా అందులో వాటా… ఇత్తారా…” ఆక్రోశంగా అడిగిందామె.
”నువ్వు ఎక్కువగా ఆలోచించమాకు. రేపొస్తానంది. నేను మాట్లాడతాగా. ఏది న్యాయమైతే అట్లా పోదాం” సర్దిచెప్పారు పెదనాన్న. నాగరత్నం విసవిసా వెళ్లిపోయింది.
నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరును ప్రకటించాక, ఆ ఊరికి అయిదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఊరిలో రాత్రికి రాత్రి ఇన్ని పరిణామాలు నేను కలలో కూడా ఊహించనివి.
”మనూరి పొలానికి బాగా రేట్లొచ్చినట్లున్నాయి…” పెదనాన్నతో అన్నాను.
”బాగా ఏంటి, ఎందుకూ పనికిరాని పొలం కూడా ఎకరం కోటి పలుకుతోంది” చెప్పారాయన.
”ఈ మజ్జెనే మేం గూడా ఓ ఎకరం కోటీ నలభైకి అమ్మాం బాబూ. అప్పుడు అమ్ముకోడమే శానా మంచిదైంది. ఇప్పుడది కోటికి పడిపోయింది” పెద్దమ్మ చెప్పింది సంతోషంగా.
వేణు వాళ్లింటికి బయల్దేరాను. రోడ్డుమీద నడుస్తుండగా హఠాత్తుగా నా పక్కన ‘డస్టర్‌’ కారు వచ్చి ఆగింది. ఊళ్లో చాలామంది ఖరీదైన కార్లు వాడటం గమనించాను. అద్దం కిందికి దించి తల బయటకు పెట్టాడు అక్కల కిట్టయ్య.
”ఏరా, బానే సంపాయించావంటగా. ఓ ఎకరం కొనరాదూ, చాలా తక్కువలో వస్తంది” అన్నాడు. నేను వద్దన్నట్లు తలూపాను. మారుమాట్లాడకుండా ముందుకెళ్లిపోయాడు. బస్టాండ్‌ సెంటర్‌లో తెరిచిన రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసు కిట్టయ్యదే. మృత్యుముఖం నుంచి బయటపడి, ఇప్పుడు కమీషన్ల రూపంలో దండిగా సంపాదిస్తున్నాడని మధు బాబాయ్‌ చెప్పాడు.
సిమెంటురోడ్డు వంతెన మీద దాసరి పిచ్చయ్య దిగులుగా కూచొని ఉన్నాడు. పలకరిస్తే, బావురుమన్నాడు.
”దిగులు పడక ఏంజెయ్యమంటావు బాబూ! ఉన్న ఎకరంన్నర పొలం ల్యాండు పూలింగులో పొయ్యింది. ఆ కాస్త నేల ఆధారంతోనే పిల్లల్ని చదివించాను. ఇప్పుడు పిల్ల పెళ్లికుంది. యాడదెచ్చి జెయ్యాలి?”
”బదులుగా ఇంటిప్లాటు, కమర్షియల్‌ ప్లాటు ఇస్తుందటగా ప్రభుత్వం?”
”నా తలకాయ. అది ఎప్పుడిస్తదో, ఎక్కడిస్తదో ఎవరికెరుక? ఇచ్చినా అది మా సేతికొచ్చేదెప్పుడు, మేం తినేదెప్పుడు?” పిచ్చయ్యలో నిర్వేదం తారస్థాయిలో కనిపించింది.
నేను భుజం తట్టి, అక్కణ్నుంచి వేణు వాళ్లింటికి వెళ్లాను.
ఆ ఇంటి వాతావరణం నాకు వింతగా తోచింది. అప్పటిదాకా ఏదో యుద్ధం జరిగినట్లు, తుపాను వచ్చి వెలిసినట్లు అనిపించింది. వేణు, హర్ష చెరో కుర్చీలో; వాళ్ల నాన్న దివాన్‌ కాట్‌ మీద యమా సీరియస్‌గా కూచొని ఉన్నారు. వేణు భార్య, వాళ్లమ్మ వంటగది దర్వాజాకు చెరోపక్కా నిలబడి ఉన్నారు. నన్ను చూసి, ఏ ఒక్కరూ కనీసం పలకరింపుగానైనా నవ్వలేదు.
వేణు విసురుగా లేచి, ”మనం బయటికెళ్లి మాట్లాడుకుందాం రా” అంటూ నన్ను గేటులోంచే వెనక్కి మలిపాడు.
ఇద్దరం మెయిన్‌ రోడ్డు మీదకొచ్చి హోటల్‌ పక్కనే నిలబడ్డాం.
”ఏం జరిగింది వేణూ?” మెల్లగా అడిగాను.
”ఛత్‌, మరీ అధ్వానంగా తయారయ్యారు. వాడంటే మూర్ఖుడు. మొదట్నుంచీ అంతే. ఈయనకి ముడ్డి కిందికి డెబ్భై ఏళ్లొచ్చాయి. ఈయన బుద్ధేమైంది?” అసహనంగా అన్నాడు.
”అసలేం జరిగింది?”
”వాడి కోసం చదువు మానుకున్నా. గొడ్డులా చాకిరీ చేశా. ముంబైలో ఉద్యోగంలో చేరాకైనా ఏనాడూ పైసా పంపిన పాపాన పోలేదు. పైగా వాడి పొలం మందం రూపాయి తక్కువ కాకుండా నా దగ్గర్నుంచీ కౌళ్లు వసూలు చేసేవాడు. బదులుగా, నా భాగంలో రెండెకరాలు ఎక్కువ వచ్చేట్టు లక్షసార్లు అనుకున్నాం. ఇవ్వాళొచ్చి, సమానభాగం కావాలని నోరేస్కుని అరుస్తున్నాడు, ఎదవ…” వేణులో అంత కోపం నేనెప్పుడూ చూళ్లేదు.
”పోన్లే వేణు, నువ్వు బతకలేని స్థితిలో లేవుగదా. రెండెకరాలదేముంది, వదిలేసెయ్‌” అనునయించాను.
”వదిలెయ్యక, కట్టుకుపోతానా. రెండెకరాల గురించి కాదు బాధ. మాట మారుస్తున్నందుకు…” కొద్దిగా శాంతించాడు.
నేను బస్టాండు వైపు చూశాను. పాతికపైగా కార్లు వరసగా ఆగి ఉన్నాయి.
”ఇదేమిటి వేణు, ఇన్ని కార్లా!” అది మా ఊరి సెంటరేనన్న విషయం నాకో పట్టాన నమ్మబుద్ధి కావడం లేదు.
”బేరగాళ్లు. హైదరాబాదు, వైజాగ్‌, నెల్లూరు, తిరుపతి, మద్రాసు, బెంగుళూరు… అన్ని ప్రాంతాల నుంచీ వస్తున్నారు.  ఇక్కడేం జూశావ్‌? పొలాల దగ్గరకెళ్తే, నీకు కళ్లు తిరుగుతయ్‌. ఈ రెణ్నెల్ల నుంచీ తాకిడి తగ్గింది. రాజధాని నిర్మాణం నిజంగా మొదలైతేగానీ అసలు సినిమా కనబడదు” తాపీగా చెప్పాడు.
”బాప్‌రే. పోన్లే, మన ట్రస్టు పొలం దాకా వెళ్లొద్దామా” అడిగాను. తను సరేనన్నాడు. కాలినడకనే బయల్దేరాం.
సెంటర్‌లో ఆగిన కార్లను, గుంపులవారీ జనాల కబుర్లను దాటుకుంటూ మంగళగిరి రోడ్డులోకి చేరుకున్నాం. ఆ రోడ్డులో ఎడమపక్కన ఉన్న కాలనీ దాటగానే ఓ ఎకరం పొలాన్ని రెండేళ్ల క్రితం పదిహేడు లక్షలకు కొన్నాను. ట్రస్టు తరఫున వృద్ధాశ్రమం నిర్మించాలని నా కల. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాను.
ఊరింకా దాటనే లేదు. ఇళ్లింకా కనుమరుగు కాలేదు. రోడ్డుకు ఇరువైపులా బహిరంగ మలవిసర్జన కారణంగా దుర్వాసన ముక్కుపుటాలను అదరగొడుతోంది. ఊరు దాటగానే మెయిన్‌రోడ్డు నుంచి మా పొలంలోకి దిగుతుంటే ”జాగ్రత్త, నిప్పులుంటాయ్‌. చూసి దిగు” అన్నాడు వేణు పెద్దగా నవ్వుతూ.
”ఇదేంటి వేణు, కాలనీలో ఇంతమందికి మరుగుదొడ్లు లేవా?” ఆశ్చర్యంగా అడిగాను.
”హహ్హహ్హా… మా గ్రామసీమను అలా అవమానించకు. ప్రపంచం ముక్కున వేలేసుకునే స్థాయిలో నిర్మితం కాబోతున్న రాజధానిలో ఈ ఊరు అంతర్భాగం కాబోతోంది” అన్నాడు నాటకీయంగా.
ఆ ఎకరం స్థలంలో యాభై ట్రక్కుల ఇసుక, కొన్ని రాళ్లు పడి ఉన్నాయి.
”పర్మిషన్‌కు ఇంకెన్నాళ్లు పడుతుంది?” అడిగాడు వేణు, ఇసుక మీద కూచుంటూ.
”ఫైల్‌ మూవ్‌ అయిందట. ఈ నెలలోనే రావచ్చు” చెప్పాను నేను కూడా వేణు పక్కన చతికిలబడుతూ.
”అవును వేణూ, మన స్కూలెలా ఉంది?” అడిగాను దూరంగా కనిపిస్తున్న పత్తిచేను వైపు చూస్తూ.
”ఏం స్కూల్లే, తిప్పితిప్పి కొడితే వంద మంది లేరు. ఊళ్లో ఆరు ఇంగ్లిషు మీడియం స్కూళ్లు వెలిశాయి” వేణు చెప్పాడు బాధగా. గతంలో ఆ స్కూల్లో అయిదారు వందల మంది విద్యార్థులుండేవారు.
కాసేపు కూచొని, మళ్లీ రోడ్డెక్కాం. నీరుకొండ పొలం నుంచి వస్తున్నట్లున్నాడు, భాష్యం రాము నాకు దగ్గరగా వచ్చి ”అరే, నీ మంచి కోరి చెబుతున్నాను. ఇప్పుడీ ఎకరం రెండు కోట్లు పలుకుద్ది. హాయిగా అమ్మేసుకుని, దూరంగా ఎక్కడైనా కట్టుకో నీ ఆశ్రమం” అన్నాడు. ఊళ్లో అడుగు పెట్టిన దగ్గర్నుంచీ ఇప్పటికి పాతిక ముప్ఫై మంది ఇదే సలహా ఇచ్చారు నాకు.
నేను నవ్వి ఊరుకున్నాను.
వేణు, నేను బస్టాండ్‌ సెంటరుకు చేరుకున్నాం. తుళ్లూరు రోడ్డులో ఉన్న మద్యం షాపుల ముందు జనం కిక్కిరిసి ఉన్నారు. ఎట్నుంచి వచ్చాడో, నన్ను వాటేసుకుని ఏడవటం మొదలు పెట్టాడు అయూబ్‌ఖాన్‌.
”అరే వెంకట్‌, ఇద్దరాడ పిల్లలకీ పెళ్లిళ్లు చెయ్యడానికి ఉన్న రెండెకరాలూ అమ్మేశాను. నాలుగేళ్ల నించి కూలీపనులు చేసుకు బతుకుతున్నా. ఇప్పుడిదంతా కాంక్రీటు జంగిల్‌ అయితదంట. రేపట్నుంచీ ఆ కూలీ కూడా దొరికేట్టు లేదు” వాడి నోటినుంచి మద్యం వాసన గుప్పుమంటోంది. నాకు తెలిసి అంతకుముందు అయూబ్‌కు తాగుడు అలవాటు లేదు.
వాడికేదో నచ్చజెప్పి, ఇంకొంచెం ముందుకు నడిచాం.
సైరన్‌ మోగించుకుంటూ రెండు పోలీసుజీపులు వినాయకుడి గుడి వైపు దూసుకెళ్లాయి.

ఉన్నట్టుండీ ఒక్కసారిగా ఊరి వాతావరణంలో ఏదో మార్పు. జరగరానిదేదో జరిగిపోయినట్టు, జనం గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. గుడివైపు నుంచి నడిచివస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని ‘ఏం జరిగింది’ అని అడిగాడు వేణు.
”అదేరా, ఆస్తుల గురించి కోర్టుకెక్కి కొట్టుకుంటున్నారే కృష్ణమూర్తి కొడుకులు… వాళ్లిద్దరూ గొడవ పడ్డారు. మాటామాటా పెరిగింది. ఆవేశంలో గొడ్డలి తీసుకుని తమ్ముణ్ని నరికి చంపాడు అన్న…”
నా ఒళ్లు జలదరించింది. తల దించుకుని, కాళ్లకింద మట్టిని తీక్షణంగా చూస్తూండిపోయాను.
మట్టి… మనుషుల్ని నమిలి ఊస్తున్నట్లుగా ఉంది.
అక్కడక్కడా సిగరెట్‌ పీకలు, బీరుసీసాల మూతలు…
ముందు చక్రాలు గాల్లోకి లేచి, ట్రక్కు తిరగబడుతున్నట్లు… ఏదో భయం!
ఈసారి పక్కకు దూకగలమో.. లేదో…
సేద తీరడానికి చెట్టునీడ ఉంటుందో… లేదో…
కూలితల్లి తెరిచే సత్తు టిపినీలో సద్దన్నం, బీరపచ్చడి ఆనవాళ్లు మిగులుతాయో… లేదో…
): ):

No comments:

Post a Comment